“యేసు రాజుగా వచ్చుచున్నాడు…”, “రాకడ సమయములో కడబూర శబ్ధముతో…”, “అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు…”, ఇలాంటి పాటలు నేను విని బహుశ 20-25 సంవత్సరాలు అయిఉంటుంది. ప్రభువు రాకడను గూర్చిన పాటలు ఇప్పుడు ఎక్కువగా వినిపించట్లేదు. కారణం ఏంటి? ఈ పాటలు ఎందుకు వినబడట్లేదు?
నేను ఒక సంఘకాపరి కుటుంబములో పెరిగాను. నా చిన్నతనములో (సరిగ్గా 20-25 సంవత్సరాల క్రితం) మా కుటుంబ ప్రార్థన లో ప్రభువు రాకడను గూర్చిన పాటలు పాడేవాళ్ళము. రాకడను గురించి ఆసక్తికరమైన సంభాషణ జరిగేది. “సూర్యుడు నలుపైయ్యే రోజు, చంద్రుడు ఎరుపైయ్యే రోజు, నక్షత్రములు రాలే రోజు, దిక్కులేక అరిచే రోజు…”, అనే పదాలు వింటూఉంటే నా కాళ్లలో వణుకు పుట్టేది. అమ్మో! ప్రభువు తిరిగి రాబోతున్నాడు, తీర్పు దినము ఒకటి ఉన్నది, ఈ లోకం శాశ్వతం కాదు, అనే ప్రాముఖ్యమైన సత్యాలు నా హృదయముపైన ముద్రించబడింది అప్పుడే.
కాని ఈ రోజు సంఘములో ఆ గానం లేదు. వేరే పాటలు వినబడుతున్నాయి. నేటి సంఘము సరైన ఆత్మీయ స్థితిలో లేదని చెప్పడానికి ఇది ఒక సూచన.
థెస్సలొనీక సంఘమును గూర్చి పౌలు ఇచ్చిన సాక్ష్యం ఒక్కసారి వినండి: “మీరు విగ్రహములను విడిచిపెట్టి, …సత్యవంతుడగు దేవునికి దాసులగుటకును, …యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూచుటకును, …దేవుని వైపునకు తిరిగారు…” (1 థెస్స 1:9,10).
సంఘము ప్రభువు కొరకు ఎదురు చూడడం బహు కీలకమైన అంశం. లోకమును విడచిపెట్టి దేవుని వైపునకు తిరిగిన వాళ్ళు యేసు పరలోకమునుండి వచ్చునని ఎదురు చూస్తారు. ‘ఎదురు చూచుట’ అనేది హృదయములోనుండి పుడుతుంది. దేన్ని ఎక్కువగా ఇష్టపడతామో దానికొరకు ఆశతో ఎదురు చూస్తాము. నామకార్ధ క్రైస్తవులైతే భూసంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తారు. కాని నిజమైన విశ్వాసులు సహితం ఈ ఊబిలోనికి ఈడ్చబడుతున్నారు.
స్వస్థతలు, డబ్బులు, ఘనతలు, శరీరసంబంధమైన ఇతర ఆశలు హృదయాలను ఏలుతున్నాయి. క్రిస్మస్ లాంటి వేడుకలుకు ఇచ్చే ప్రాధాన్యత మితిమీరుతుంది. ఉజ్జీవాల కొరకు ఎదురు చూసేవాళ్ళు కొందరైతే, ఆత్మ కొరకు ఎదురు చూడాలని చెప్పేవారు కొందరు. మన దృష్టంతా ఇలాంటి వాటి మీదికి మళ్ళించబడుతుంది కాబట్టి ప్రభువు రాకడ పైన ఉండవల్సిన ఆశ బలహీనమైపోతోంది. ఇది ఎంతో ప్రమాదకరము.
"మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు" (కొలస్సీ 3:1-4), అని దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తోంది.
ప్రియ చదువరి, నీవు యేసు క్రీస్తు ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నావా?
ఎవరికి ఇష్టమున్న లేకున్న ఎవరు నమ్మిన నమ్మకపోయిన యేసు క్రీస్తు ప్రభువుగా తిరిగి రాబోతున్నాడు.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను. (ప్రకటన 22:17).
మారనాత!
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.