అసలే నక్క. చాలా నీరసించిపోయి మూలుగుతూ తాడి చెట్టు క్రింద కూర్చుంది. కాసింత నీడ దొరుకుతుందేమో అని అనుకుంటుంటే, టపీ మని తాటికాయ తలమీద పడిందంట.
యోబు ఆస్తిపాస్తులన్నీ కోల్పోయి, పిల్లలందరినీ కోల్పోయి, శరీరమంతా పుండ్లతో తీవ్రంగా దుఃఖపడుతూఉంటే, దేవుడాయన దగ్గరికి వచ్చి, “మకరమును నీవు లాగగలవా?” అని అడిగాడు.
తాటికాయ పడినట్టు ఉంది, కదా?
కానీ, జాగ్రత్తగా ఆలోచిస్తే, అవి బహు ధైర్యాన్ని ఆదరణను కలిగించే మాటలు.
అన్నిటిని నిర్మించినవాడు, అన్నిటిని పరిపాలించేవాడు దేవుడు మాత్రమే అనే రెండు అంశాలు దేవుడు యోబుతో చేసిన సంభాషణలో మనం చూస్తాము.
నీ పరిస్థితి ఏదైన, నీకు ధైర్యము నెమ్మది కలగాలంటే ఈ రెండు అంశాలు నీవు గ్రహించాలి. హైడెల్బర్గ్ ప్రశ్నావళి (Heidelberg Catechism) అదే చెబుతుంది. సంఘ చరిత్రలో ప్రాచుర్యం పొందిన ఈ ప్రశ్నావళిలో మొదటి ప్రశ్న ఇలా ఉంటుంది:
ప్రశ్న: నీ బ్రతుకులో చావులో నీకున్న ఏకైక ధైర్యం (ఆదరణ) ఏంటి?
జవాబు: నేను నా సొత్తు కాదు. నా శరీరము ఆత్మ, బ్రతుకులోను చావులోను, నా నమ్మదగిన రక్షకుడైన యేసు క్రీస్తుకు చెందుతాయి. ఆయన తన అమూల్యమైన రక్తమును నా కొరకు చిందించి, నా పాపముల నిమిత్తము పరిపూర్ణమైన ప్రాయశ్చిత్తము చేసి, అపవాది యొక్క బలము నుండి విడిపించి, నన్ను ఎంతగా కాపాడుతున్నాడంటే నా పరలోకపు తండ్రి సెలవు లేకుండ నా తలవెంట్రుకలలో ఒక్కటైనను రాలిపోదు. సమస్తము నా రక్షణ కొరకే సమకూడాలి. కాబట్టి ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా నిత్యజీవమును గూర్చిన నిశ్చయత నాకు కలిగిస్తూ నేను హృదయపూర్వకముగ ఆయన కొరకు జీవించునట్లు చేయుచున్నాడు.
ఈ జవాబులో మన ఆదరణ కొరకు అవసరమైన రెండు అంశాలు ఉన్నాయి.
1. మనము మన సొత్తు కాదు. మనము దేవుని చేత నిర్మింపబడి, విమోచింపబడిన ఆయన సొత్తు. నా ఓనర్ ఆయనే. యోబుతో దేవుడు, “నేను చేసిన నీటిగుఱ్ఱమును నీవు చూచియున్నావు గదా,” ‘నిన్ను నిర్మించినట్టే దాన్ని నిర్మించాను. దాని బలము చూడు. నేనే నిర్మానకుడను,’ అని ఆదరణ కలిగించే ఈ సత్యము తెలియజేసాడు. సమస్తానికి ఓనర్ ఆయనే.
2. మనలను మనము పరిపాలించుకోలేము. మన పరిపాలకుడు దేవుడే. “మకరమును నీవు లాగగలవా?” అని దేవుడు యోబును ప్రశ్నిస్తూ, అన్నిటిని నడిపించేది ఆయనే అని తెలియజేసాడు. ఆయన సెలవు లేకుండ ఒక పిచ్చుక కూడ రాలిపడదు. సమస్తాన్ని కంట్రోల్ చేయగలిగేది ఆయనే.
ఈ రెండు అంశాలతో దేవుడు యోబును ధైర్యపరచాడు. అప్పుడు యోబు యెహోవాతో…, “నీవు సమస్తక్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలిసికొంటిని… వివేచనలేనివాడనైన నేను ఏమియు నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని… వినికిడిచేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని, ధూళిలోను బూడిదెలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను,” అంటూ పశ్చాత్తాపపడి ఆదరణ పొందుకున్నాడు.
మన పితరుడైన యోబుకు ఇలాంటి ధైర్యము కలిగితే, సిలువ వేయబడిన యేసు క్రీస్తులో దేవుని ప్రేమను రుచి చూచిన మనకు ఇంకెంత నెమ్మది ధైర్యము కలగాలి?
నక్క మీద పడ్డ తాటికాయ సంగతేమోగాని, యోబు గారి మీద మాత్రం పరలోక తైలమే కుమ్మరించబడింది.
Joseph Livingston serves as a pastor at Life Eternal Church, Hyderabad. He and his wife are blessed with two children.